Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, October 12, 2012

ఓ జ్ఞాపకం

నేను దాదాపు పది సంవత్సరాలు ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళిన.ముందు బాబా హారతి పాట నచ్చి,తరువాత ఆ హారతి పాట నేర్చుకునేటందుకు,నేర్చుకున్నాక పాడేటందుకు,ఆ తరువాత బాబా మీద భక్తితో,నమ్మకంతో అట్లా వెళ్తూనే ఉన్నాను.
 మేము ఉండే కాలనీకి కొంచెం దూరంలో గుడి ఉండేది.నడవడానికి అరగంట పట్టేది.రెండస్థుల భవంతిలో చూడటానికి గమ్మత్తుగా ఉండేది.ఆ ఏరియాలో అదొక్కటే బాబా గుడి అవడంతో ఎంతో మంది వచ్చేటోళ్ళు,అన్ని సంవత్సరాలు వెళ్ళడం వలన నాతో పాటుగా క్రమం తప్పకుండా గుడికి వచ్చే వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టేవారు,కొందరు పలకరించేవాళ్ళు. 

 ఒకరోజు ఎప్పటిలాగే గుడికి పోయి,హారతి ప్రారంభం కాంగనే నేను కూడా పాడటం ప్రారంభించిన,మధ్యలో కరెంటు పోవడం వల్ల టేప్ లో వచ్చే హారతి పాట ఆగిపోయింది.అది ఆగిపోయినా హారతి పాట వచ్చిన నాలాంటి వాళ్ళం ఆగకుండా పాడుతూనే వున్నాం.అందులో నేను కాస్త శ్రుతి పెంచి గట్టిగా పాడుతున్నాను.హారతి అయిపొయింది.కరెంటు కూడా వచ్చింది.ఎందుకో తల తిప్పి చూసిన నాకు,నన్ను చూసి అభినందిస్తున్నట్టుగా తను నవ్వినట్టు అనిపించింది.పాట కర్ణకఠోరంగా పాడినందుకేమో అని ఎవరో తెల్వకపోయినా తన నవ్వుకి నా నవ్వుతో నేను బదులిచ్చాను.
                           ఆనాటి నుండి ప్రతి గురువారం మేము ఒకరిని ఒకరం చూసుకుంటే నవ్వుతోనే పలకరించుకునేటోళ్ళం.తను ఒకోసారి వచ్చేది కాదు,ఒకోసారి తన స్నెహితురాలితో వచ్చేది.చాలసార్లు గుడికి వెళ్ళే దారిలో నా ముందే నడిచేది,లేక నా వెనకే వచ్చేది.రోడ్డుకి అటువైపు తను,ఇటువైపు నేను నడిచిన రోజులు కూడా చాలానే ఉన్నాయి.కాని ఎప్పుడూ నేనామెని మాట్లడించలేదు.తను కూడా నన్నెప్పుడూ మట్లాడించలేదు.అంత అవసరం మాకు రాలేదు కూడా.కనిపించిన ప్రతీసారి చిన్న చిరునవ్వులతోనే దాదాపు నాలుగేళ్ళు గడిచిపోయింది.
మౌనం కన్నా గొప్ప సంభాషన ఏముంటుంది?

మా పరిచయం ఒక్క నవ్వుతోనె మొదలయింది,మా కుశల ప్రశ్నలు,మా సంభాషణ,మా స్నేహం,మా బంధం అంతా ఆ ఒక్క నవ్వులోనే ఉండెవి.అక్కడితోనె ఆగిపొయేవి.

 తనెప్పుడూ బాబాకి కోవా తెచ్చేది.హారతి తరవాత అందరికీ పంచి పెట్టేది.నేనెక్కడున్నా నా దగ్గరికి వచ్చి చిన్నగా నవ్వి నా చెతిలో కోవా పెట్టి వెళ్ళేది.
       
 కొన్ని రోజులకి మేము అక్కడి నుండి ఇల్లు మారటం వల్ల ఆ గుడికి వెళ్ళటం పూర్తిగా ఆపేశాను .
ఒక ఆరు నెలల తరువాత గురువారం సాయంత్రం ఆ గుడికి వెళ్ళడం జరిగింది.
హారతి అంతా అయిపోయాక,నన్ను చూసి నిండుగా నవ్వె నవ్వు కోసం,తను ఇచ్చే కోవా కొసం వెతికాను.తను రాలెదు,కనిపించలేదు.
ఆ బాబా గుడి తలుచుకున్నప్పుడల్లా తను గుర్తొస్తూనే ఉండేది.

 మరొక రెండు సంవత్సరాల తరువాత అనుకోకుండా గురువారం రోజు అదే గుడికి వెళ్ళాను నా స్నెహితులతో,....చిన్నప్పటి నుండి వచ్చిన స్థలం,నడచిన దారి...అన్నీ ఎంతో ఆహ్లాదం కలిగించాయి.గుడి లోపలికి వెళ్ళి హారతి ప్రారంభిస్తారనగా నిలబడి ఉన్న నాకు తన స్నెహితురాలు కనిపించింది.
ఎంతో ఆనందంతో ధైర్యం చేసి తన దగ్గరికి వెళ్ళి..."మీతో పాటు మీ ఫ్రెండ్ వచ్చేది కదా ఎప్పుడూ..తనెలా ఉంది?బాగుందా?" అని అడిగిన.
తను నన్ను గుర్తుపట్టిందో ఏమో  తెల్వదు కానీ...తను చెప్పిన సమాధానంతో నేను ఎంతో బాధపడ్డాను.ఆ నిమిషంలో మనకి ఏమీ కాని వారి కోసం కూడా మనం ఇంత బాధపడతామా అనిపించింది.

ఇంతలో హారతి ప్రారంభించారు.
 కానీ,నా మనసులో ఒక్కసారిగా తన గురించిన అలోచనలు నిండిపోయాయి.
నాకు తన పేరు తెలియదు.తను ఎక్కడుంటుందో తెలియదు,తన స్వభావం తెలియదు,తన వాళ్ళెవరో తెలియదు,తన స్వరం ఎలా ఉంటుందో కూడా తెలియదు,తన నవ్వు తప్ప ఆ నవ్వు వెనకాల తనకున్న బాధలూ తెలియవు,తన చదువు,తన ఇష్టాలు,తన అయిష్టాలు ఏవీ తెలియవు.
             తన గురించి ఇవేమీ తెలియని నాకు....ఆమె శాశ్వతంగా నిద్రపోయింది అని తన గురించి తెలిసిన ఒకే ఒక్క నిజం మాత్రం నన్ను ఎంత గానో బాదపెట్టింది.
ఆ క్షణం నా మనసులో తను నన్ను చూసి మనస్పూర్తిగా నవ్వే నవ్వు గుర్తుకు వచ్చింది.
తనెవరో తెలియకపోయినా,ఈ లోకంలో తను లేకపోయినా..తన నవ్వు మాత్రం నా జ్ఞాపకాలలో ఇప్పటికీ సజీవంగానే ఉంది!!!


Thursday, February 9, 2012

సిరివెన్నెల....తిట్టిండ్రా--పొగిడిండ్రా??!!

 సినిమా పాటల్లో స్త్రీని వర్ణించమనంగనే మన సినీ కవులు వారిని దివిలో ఉండే పారిజాతాలుగానో,నింగి,నేల తానై నిండిన శక్తి గానో,జీవన జ్యోతులు గానో,త్యాగ మూర్తులు గానో,ఎగసి పడే సముద్రం గానో,...ఇట్లా రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు.
               అయితే సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు రాసిన "మహిళలు మహరాణులు" పాట వీటన్నిటికీ భిన్నంగా ఉండి,స్త్రీ తత్వాన్ని మొత్తం మన ముందు ఉంచుతది..ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య ఇది అనిపిస్తది ఇది చదువుతుంటే....."జాన జాన పదాలతో..జ్ఞాన గీతి పలుకునటే.." అని 'ఆపద్బాందవుడు' సినిమాలో ఆయనే రాసినట్టు..చిన్నోళ్ళు కూడా అర్దం చేసుకునే భాషలో,అంతే లోతైన భావంతో ఉంటది ఈ పాట.

  ఈ పాటలో 'అతి' ఉండదు.....స్త్రీలని తిట్టినా,పొగిడినా అవి అందరూ ఒప్పుకునే నిజాలే...అసలు తిడుతుండ్రా పొగుడుతుండ్రా అని మనకి అర్దం కాదు..సిరివెన్నెల రాసిన నిందా స్తుతి గీతం అనంగనే గుర్తుకువచ్చే పాట "ఆదిభిక్షువు వాడినేది కోరెదీ..",అయితే అది ఒక్క దేవుని /ఒక వ్యక్తి లక్షణాలకి మాత్రమే పరిమతమయ్యే పాట...కాని ఈ పాట మాత్రం సృష్టిలోని స్త్రీలందరికీ ఆపాదించగలిగే పాట....
 

మనం గమనిస్తే,..ఒక వాఖ్యంలో స్త్రీలోని గొప్ప గుణాన్ని చెప్తూ,,..దాని వెనువెంటనే వచ్చే వాఖ్యంలో మహిళలోని మరో కోనాన్ని స్పృశిస్తూ అందంగా సాగిపోతుందీ గీతం...అంతే అందంగా పాడిండ్రు మన బాలు గారు.."ఆడదే ఆధారం" చిత్రం లోనీ ఈ పాటకి సంగీతం అందించింది శంకర్ గణేష్.

 మహిళలు మహరాణులు...
పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు..
భగ్గుమనే కాపురాల అగ్గి రవ్వ భామలు..
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు..
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు..           
...మహిళలు మహరాణులు...

ఆశ పుడితే తీరు దాకా ఆగరు యెలనాగలు..
సహనానికి నేల తల్లిని పోలగలరు కొలతులు..
అమ్మగా
లోకానికే ఆయువిచ్చు తల్లులు..
అత్తగా అవతరిస్తె వారే అమ్మతల్లులు..

ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు..
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు..
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు..            
...మహిళలు మహరాణులు...

విద్య ఉన్నా విత్తమున్నా వొద్దికెరుగని వనితలు..
ఒడ్డు దాటే ఉప్పెనల్లే ముప్పు కాదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే వద్దంటే
మానమూ మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణ కొద్దీ కాపాడే రెప్పలే
కత్తులై పొడిచెస్తే ఆపేదింకెవరులే
వంగి ఉన్నా కొమ్మలే బంగారు బొమ్మలు              ...
మహిళలు మహరాణులు...


ఇట్లా స్త్రీలనూ,వారి స్వభావాన్ని చెట్టువేరుతోనూ,అగ్గిరవ్వతోనూ,ఇంధనంతోనూ,కొమ్మలతోనూ పోలుస్తారు...ఈ పోలికలు ఒక ఎత్తు,కనురెప్పలతో పోల్చడం ఒక ఎత్తు అనిపిస్తది నాకు..సున్నితమైన స్త్రీలను..అంతే సున్నితమైన కనురెప్పలతో పొల్చడం ఎంత బాగుంది...!!
ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవల్సిన పాట ఇది..

చివరగా,..'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే...ఈ ఒక్క పాటకే సిరివెన్నెలకి "పద్మశ్రీ" ఇచ్చెటోడ్ని..!!

Saturday, February 4, 2012

"రామాయణ విషవృక్షం"-రాముడు దేవుడా?!

"రామాయణ విషవృక్షం"( మొదటి భాగం)అనే ఈ పుస్తకం చదివి నాలో కలిగిన అలోచనలు,అభిప్రాయాలు,అన్నిటికంటె ముఖ్యంగా ఈ పుస్తకంలోని విషయాలను తెలియపరచాలనే ఉద్ధెశ్యంతో ఇది రాయడం జరిగింది..
 

"రామాయణ విషవృక్షం",(రచన-రంగనాయకమ్మ,..విశ్వనాధ సత్యనారాయణ గారు "రామాయణ కల్పవృక్షం" అని రాస్తే దానికి సమధానంగా "విషవృక్షాన్ని" రాసారని విన్నాను..అది ఎంత వరకు నిజమో తెలియదు మరి.. ),అని చూడగానే ఎదో ప్రత్యేకమైన నవల అని చదవడం మొదలుపెట్టాను...నాలుగు పుఠలు చదవగానే రాముడిని ఒక మోసగాడిగా,అజ్ఞానిగా, ఎన్నో అవలక్షనాలు,దుర్గుణాలూ ఉన్న రాజుగా రచయిత్రి చేసిన వర్ణన నచ్చక చాలా రొజులు మళ్ళీ ఆ పుస్తకం  తెరవలేదు.కొన్ని రొజుల తర్వాత 'రాముడు దేవుడు' అనే నా నమ్మకాన్ని పక్కన పెట్టి ఆ పుస్తకాన్ని తిరిగి చదవడం ప్రారంభించాను.

 అసలు ఈ పుస్తకం ముఖచిత్రమే వింతగా ఉంటుంది..శ్రీరాముడు వెనుక నడుస్తూ,లక్ష్మణుడు మూట,ముల్లె,దనుర్బాణాలూ మోస్తూ ముందు నడుస్తుంటాడు..సీత వారిరువురికి మద్యలో  ఉంటుంది..రాముడు ధీరుడైతే అడవిలో ముందు నడవాలి కానీ,పిరికి వాని లాగా వెనక నడవడం ఎందుకు? అనే సందేహం మనకి కలుగుతుంది..ఈ ముఖచిత్రాన్ని వేయమని ఒక ప్రముఖ చిత్రకారుడిని కోరితే,.."రామ-రామ" అని రాసి రచయిత్రి పంపిన డిమాండ్ డ్రాఫ్ట్ ని వెనక్కి పంపించారట..(ఆ చిత్రకారుని పేరు రచయిత్రి ప్రస్తావించలేదు కానీ,అది ఖచ్చితంగా బాపు గారే).ఇది రచయిత్రి సృష్టించిన బొమ్మ మాత్రమే అని మనం అనుకోవడానికి వీలు లేదు...వాల్మీకి రాసిన శ్లోకాలతో సహా ఉదహరిస్తూ రాముడే లక్ష్మణుడిని తన జాగ్రత్త కోసం,రక్షణ కోసం ముందు నడవమని ఆజ్ఞాపించాడని నిరూపిస్తారు రచయిత్రి.

ఇక ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం,ప్రతీ అక్షరం తర్కంతో కూడుకున్నదే...రామాయణాన్ని దోపిడీ వర్గానికి 'అందమైన కావ్యం' అని వర్ణిస్తూ...రచయిత్రి ఎంతో చక్కగా మానవ పరిణామ క్రమాన్ని..సాంఘికంగా,సామాజికంగా,రాజకీయంగా,ఆర్దికంగా మనవ జీవనాల్లో వచ్చిన మార్పులను,కుల వ్యవస్థ మొదలైన క్రమాన్ని,స్త్రీలు స్వతంత్ర హీనులుగా,బానిసలుగా,వేశ్యలుగా మారిన క్రమాన్ని,మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థగా ప్రపంచం మారిన క్రమాన్ని,ధనికులు,పేదలు,కులాలు,మతాలు,కట్టుబాట్లు ఏర్పడిన వైనాన్ని,'వేదాలు','పురాణాలు' వంటివి రాయబడిన సందర్బాన్ని,ఆదిమానవుని గణ వ్యవస్తను,ఫ్యూడల్,పెట్టుబడిదారీ,కమ్యునిస్టు  వ్యవస్తలను కూలంకషంగా విశదీకరించారు.

 రామాయణం గురించి తెలుసుకునేటప్పుడు అది చరిత్ర పరిణామ క్రమంలో ఏ దశలో వుద్బవించిందో,ఏ  వ్యవస్తలని కాపాడటానికి,ఏ వర్గాన్ని బలపరచడానికి,ఏ ధర్మాల్ని శాశ్వతంగా ఉంచడానికి నిర్దేశించబడిందో,.ఎవరి ప్రయోజనాల కోసం ప్రచారం చెయ్యబడుతుందో తెలియజెప్పటానికి చరిత్ర క్రమం అంతా వివరిస్తారు.రామాయణం కథ ఫ్యూడల్ దశను,ఫ్యూడల్ వ్యవస్థను బలపర్చడానికే పుట్టిన కథ అని రచయిత్రి అభిప్రాయం(అది ఎంత నిజమో పుస్తకంలోని రామాయణం చదువుతుంటే మనకి అర్థం అవుతుంది.ఇది రచయిత్రి సొంతగా రాసిన రామాయణం కాదు,.వాల్మీకి రామాయణమే).

ఈ పుస్తకం చదివే క్రమంలో రామ-రావణ యుద్ధం ఆర్య-ద్రవిడుల మధ్య జరిగిన ఘర్షనగా,రామాయణం ఆర్యుల కోణం నుంచీ,ఆర్యుడు రాసిన పుస్తకం కాబట్టి,శివుడిని కీర్తించే ద్రావిడులను(రావణుడు) రాక్షసులుగా చిత్రీకరించారనే కొత్త కోణంలో రామాయణాన్ని తెలుసుకుంటాం..."రాముడు ఆర్యభూమి విస్తరణకే కదా జన్మించింది.." అని విశ్వామిత్రుడు దశరధుడితో అనే మాటల వల్ల అది రుజువు అవుతుంది కూడా..
                                     అదే విశ్వామిత్రుడు దశరధుడితో "బ్రాహ్మణులకి ధాన-ధర్మాలు బాగా చేస్తున్నావా?నాస్తికులను అణచివేస్తున్నవా?కులసంకరం జరగటం లేదు కదా? శూద్రులు అందరినీ సేవిస్తూ,అణిగి మనిగి ఉంటున్నారు కదా?" లాంటి ప్రశ్నలు వేస్తాడు...అలాగే తాటకితో యుద్ధం చేసే సమయంలో రాముడితో "ప్రజలంటే బ్రాహ్మణులే,వేద శాస్త్రాలు చదవడానికి అర్హతలేని శూద్రులు,తక్కువ జాతివారు ప్రజలు కారు" అంటాడు...ఇంకో సందర్బంలో కైకేయి దశరధుడితో "ఎప్పుడూ తమ కష్టాలని పెడచెవిన పెట్టే రాజుల కోసం ప్రజలు కన్నీరు కారుస్తారా?" అంటుంది,అలాగే ఒకసారి గుహుడు లక్ష్మణుడితో "రాజకులంలో పుట్టారు,మీరు కష్టపడటం ధర్మం కాదు..మావంటి వారికి నిద్రాహారాలు లేకపోయినా పర్వాలేదు" అని అంటాడు...ఈ ప్రశ్నల వల్లా,ఈ సంబాషణల వల్లా కులవ్యవస్త ఆనాటి నుండి ఉందనీ,తక్కువ జాతి వారిని అణగదొక్కటమే లక్ష్యంగా వ్యవస్తలు,రాజులు పని చేసారని అర్థం అవుతుంది..పితృవాఖ్య పరిపాలనా,సీతా దేవి భర్తను అనుసరించి పతివ్రత అనిపించుకోవాలని అనుకోవడం మొదలైనవన్నీ పితృస్వామ్య వ్యవస్తను బలపర్చడానికీ,స్త్రీలను అదుపు,ఆజ్ఞలలో ఉంచడానికి పుట్టుకు వచ్చిన కథలు,నీతులు మాత్రమే అని తేటతెల్లమవుతుంది.

అదే విధంగా దశరధుడికి ముగ్గురు భార్యలు మాత్రమే కాక,ఇంకా 350 మంది భార్యలు ఉన్నారనీ,అసలు కైకేయిని వివాహం చేసుకునేముందు దశరధుడు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం భరతుడికే చెందుతుందనీ,అరణ్యాలకు వెళ్ళినపుడు సీత పట్టుచీరాలే తప్ప నార చీరలు కట్టలేదని..ఇలా ప్రచారంలో లేని వాస్తవాలను ఎన్నో తెలుసుకుంటాం!!

 అలాగే దశరధుడు వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తరువాత రాముడు తన తల్లి కౌసల్య తో,తమ్ముడు లక్ష్మణుడితో,భార్య సీతతో,.."తండ్రి మాట వింటేనే పుణ్యం వస్తుంది,స్వర్గ ప్రాప్తి కలుగుతుంది,అరణ్యాలకి వెళ్ళడం తోటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్" అని చెప్పే సన్నివేశం రామునిలోని స్వార్ద కోణాన్ని మన ముందుంచుతుంది.మరో సంధర్బం లో రాముడు లక్ష్మణుడితో "మాతో పాటు వనవాసానికి నువ్వు రావడం మంచిదైంది..లేకపోతే సీతని కాపాడటం నా ఒక్కడికీ కష్టమయ్యేది.." అని అంటాడు తన వీర లక్షణాన్ని తెలియజేస్తూ..!!
           మరో సారి తన తమ్ముడితో పినతల్లి కైకేయిని 'మదం ఎక్కిన వనిత' అని దూషిస్తాడు..తన తండ్రిని బుద్ధిహీనుడని నిందిస్తాడు,కాదు,తన మనసులోని మాటలను బయటపెడతాడు....ఈ విధంగా రాముడు స్థితప్రజ్ఞత లేని వాడిగా,రాజ్యకాంక్ష,కీర్తి కాంక్ష గలవాడిగా,భయస్తుడిగా మనకి దర్శనం ఇస్తాడు చేసే ప్రతి పనిలో,మాట్లాడే ప్రతి మాటలో...

 రాముడు లక్ష్మణుడికి చెప్పే ప్రతి పనిలో ఒక దర్పం కనిపిస్తుంది...యజమాని సేవకుడికి కార్య భారం అప్పగిస్తూ ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో,అదే స్వభావాన్ని రాముడు లక్ష్మణుడికిచ్చే ఆజ్ఞల్లో మనం గమనించవచ్చు..రాముడికీ,లక్ష్మణుడికీ  ఉన్నది అన్నదమ్ముల అనుబంధం కాదు,.యజమాని,బానిసల సంబంధం.పుస్తకం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది.

 రచయిత్రి తన సహజ దోరణిలో రాయడం వలన హాస్యం,వ్యంగ్యం పాలు కూడా ఎక్కువగానే ఉంటాయి....ముఖ్యంగా దశరధుడు చనిపోయి,ఆత్మగా మారిన తరువాత వివరించిన సన్నివేశం(ఇది రచయిత్రి కల్పన కావచ్చు),లక్ష్మణుడి ఇంగితం మాట్లాడే మాటలు,గుహుడి స్వబావం వర్ణించిన తీరు,భరతుడితో రాముడి సంభాషణ గురించి చెప్పిన తీరు మనకి నవ్వు తెప్పిస్తాయి.

 ఈ విధంగా ఈ పుస్తకంలో తర్కం,హాస్యం,జ్ఞానం అన్నీ ఉన్నాయి..అలాగే ప్రతీ పాత్రా రాముడిని ఉన్నతుడిని చేయడానికి తనని తాను హీనం చేసుకునేటట్టు వాల్మీకి రాయడం వంటి విషయాలని చూపిస్తారు(వాల్మీకి రాసిన రామాయణ అనువాద శ్లోకాలని సంఖ్యలతో సహా ఉదహరిస్తారు రచయిత్రి).ఇలా కొందరికి మాత్రమె ప్రయోజనకరంగా ఉండే సంప్రదాయాలని,వాటిని బలపరిచే సామజిక స్వభావాన్ని ఉటంకిస్తుంది మన పవిత్ర గ్రంధం.

 ఈ మొదటి భాగం లో బాలకాండ,అయోధ్యకాండ,సింహాసనం చెప్పుల పాలవడం,అరణ్యకాండ గురించి రాసారు.ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నందుకే రామాయణం నిజంగా ఒక విషవృక్షం అనే సంగతి మనకి బోపడుతుంది..ఎన్నో అవలక్షణాలు గల రాముడు దేవుడా? అనే సందేహం కలుగుతుంది.నిత్యం మనం స్మరించే రామాయణంలో ఇన్ని నిగూఢ విశేషాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది...రాముడి స్వభావం ఇంతేనా అని బాధ కలుగుతుంది....!!

ఆస్తికుడైనా,నాస్తికుడైనా,...తర్క జ్ఞానాన్ని నమ్మే ప్రతీ ఒక్కరు చదవవలసిన పుస్తకం ఇది..

Monday, January 30, 2012

చిన్ననాటి నా తొలి రచన

నేను 6 తరగతి లో ఉండగా రాసిన మొట్ట మొదటి పాట ఇది..చేసిన తొలి రచన ఇది...మరి పాత సినిమాల ప్రభావమో,లేక అప్పట్లో వచ్చిన 'అన్నమయ్య' సినిమా ప్రభావమో తెలవదు కాని...మొత్తానికి నా ఇష్టదైవం మీద నాలుగు వరుసలు రాసి..ఏదో సాదించినట్టు అందరికీ ఈ పాట చూపించడం,నేనే ట్యూన్ చేసి,పాడి మరీ అందరికీ వినిపించడం( హింసించడం) నాకు ఇంకా గుర్తు.......
 ఇక మీరూ చదవండి...

 "వేంకటేశ్వరుని మహత్తు..
చూస్తేనే తెలియునా గమ్మత్తు...

శ్రీనివాసునికెందరో భక్తులున్నా...
కొందరితో చేస్తాడీ గమ్మత్తు..

ఎందరికో పెడతాడు పరీక్షలు..
అవి ఎన్నటికీ కావు మనకు శిక్షలు..

ఒక్కసారి మొక్కితే పోతుందా గీత,.బ్రహ్మ రాత..
పూర్వ జన్మలో ఉండొద్దు...పాపాల ఖాతా.."

Wednesday, January 4, 2012

మేనత్త-మెగాసీరియల్

"కలికి చిలకల కొలికి మాకు మేనత్త..కలవారి కోడలు కనకమాలక్ష్మి.." అని నేను హాయిగా పాడుకోవచ్చు..ఎందుకంటే అట్లాంటి మాలక్ష్మిలు నాకు ముగ్గురు ఉన్నారు.మరి నేను ఒక్కడ్నే మేనల్లుడిని కదా...నన్ను గార్వం కూడా ఎక్కువగానే చేసెటోల్లు,ఇప్పటికీ చేస్తారు కూడా..అందులో మా మూడో మేనత్త అయితే నాతో ఆటలు ఆడటం,టీవీలో పాత శోభన్ బాబు సినిమాలు చూపించడం,జోక్స్ చెప్పడం అన్ని చేసేటోళ్ళు....పచ్చీస్ నుండి చైనీస్ చెక్కర్ దాకా,ఓనగుంటలు నుండి రమ్మి దాకా,..మా అత్తమ్మ దగ్గరికి వెళ్తే అన్నీ ఆడేటోళ్ళం..మాకు(నాకు,మా అక్కయ్యకీ...) రాని ఆటలు అన్నీ నేర్పించేటోళ్ళు.

రాను రాను,..టీవి చానల్లు ఎక్కువ అవడం,ధారావాహికలు పెరిగిపోవడం లాంటి కారణాల వల్ల మేము అందరం కలిసినా..,టీవి చూడటం లోనే మునిగిపోయేటోళ్ళం.ఇన్ని రోజులు ఆటలు,పాటలు నేర్పించిన మా అమ్మ,అత్తమ్మలు మమ్మల్ని కూర్చోబెట్టుకొని మరీ సీరియల్స్ చూసుడు మొదలుపెట్టిండ్రు...
ఆ విధంగా మేము చూసిన కళాఖండాలలో రుతురాగాలు,అంతరంగాలు,విధి,కళంకిత,ఇది కథ కాదు లాంటి కలలో కూడా మర్చిపోలేని సీరియల్స్ ఉన్నాయి(ఈ-టీవి సుమన్ బాబుని,రాడాన్ రాధిక ని బీభత్సంగా ప్రోత్సహించింది మేమే మరి)!!
ఈ సీరియల్లు ఎంతగా అలవాటు అయ్యాయంటే అసలు మాటలు కూడా తక్కువ మాట్లాడే మా బావ,.ఒకసారి అకస్మాత్తుగా.."ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ.."అని అంతరంగాలు సీరియల్ లోని పాట పాడుకుంటూ మాకు దొరికిపోయేంతగా..!!

ఈ మొదటి దఫా సీరియల్స్ జీడి పాకం లెక్క సాగీ,సాగీ అయిపోంగనే..ఇగ జీవితంలో సీరియల్స్ చూడవద్దని నేను నిర్ణయించుకున్నాను..కాని,మా అత్తమ్మ,అమ్మ వదలకుండా తరువాత వచ్చిన ప్రతీ కళాఖండాన్ని చూసి చానెళ్ళ టీ ఆర్ పీ రేటింగ్స్ పెంచడంలో కొంత సహాయపడ్డారు!! 
సీరియల్ టైటిల్ సాంగ్ దగ్గరనుండి "రేపటి ఎపిసోడ్"లో అని వచ్చే చిన్న చిన్న సీన్లు చూసేదాకా టీవీ మీద నుండి కనురెప్ప తీసేటోళ్ళు కాదు.ఆ సమయంలో దేశ ప్రధాని వచ్చి ఇంటి బయట ఉన్నారు అన్నా కూడా వినిపించుకునేటోళ్ళు కాదు.పొరపాటున ఎప్పుడైనా సీరియల్ టైంలో కరెంటు పోయిందో..కరెంటోడి దగ్గరినుండి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరిని కలిపి ఎన్ని తిట్లు తిట్టేటోళ్ళో...అంత ఆసక్తి తో,భక్తి తో ప్రతీ సీరియల్ ని ఉద్ధరించారు.

ఇట్లా కొన్ని సీరియల్లు(అదే కొన్ని సంవత్సరాలు) గడిచాయి."అంతరంగాలు" సీరియల్ అప్పుడు డిగ్రీ లో చేరిన మా బావకి "చక్రవాకం" సీరియల్ అయ్యేసరికి జాబ్ వచ్చి,పెళ్లి కుదిరింది.మా అత్తమ్మ ఆనందానికి అంతులేదు.పెళ్లి తిరుపతి లో బాగా జరిగింది.పెళ్లి అయ్యాక మా బావ అమెరికా
వెళ్లిపోయిండ్రు.

 ఈ తంతు అంతా అయినంక ఒకరోజు మా అత్తమ్మ దగ్గరకు పోయాను.
నేను వెళ్లేసరికి....
"వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండు...ఆ ఎర్ర చీర దానికి బుద్ధి వచ్చిందో.,లేదో..ఆ పనికిమాలినోడు జైలుకి పోయిండో లేదో...."అంటూ పనిమనిషితో దీర్ఘంగా చర్చిస్తున్నారు...
"ఏంది అత్తమ్మ..అంత సీరియెస్ గా మాట్లాడుకుంటుండ్రు" అని నేను అంటే...
"ఏం లేదురా...9.30కి వచ్చే సీరియల్(క్షమించాలి,ఆ కళాఖండం పేరు మర్చిపోయాను)నాలుగేళ్ల నుండి వస్తుంది...అసలు అయిపోయే ముచ్చటనే లేకుండె...బావ పెళ్లి పనులు ఉన్నా కూడా..రోజూ చూసిన..అట్లాంటిది మనం తిరుపతి పోయి వచ్చే సరికి ఆ వారం రోజుల్లోనే ఆ సీరియల్ అయిపోయి..కొత్తది మొదలయింది..అది అసలు అంత తొందరగా ఎట్లా ముగించిండో మనస్న పడ్తలేదు..."అన్నారు మా అత్తమ్మ..


నిజమే..సినిమా అంతా చూసాక క్లైమాక్స్ ముందు కరెంటు పోయినట్టు..నాలుగేండ్ల నుండి విడువకుండా కష్టపడి చూస్తున్న సీరియల్ అర్ధాంతరంగా,అసలు ముగింపు ఏమైందో తెల్వకపోతే ఎట్లుంటదో నాకు తెల్సు..(ఒకనాటి సీరియల్ బాధితుడ్ని కదా మరి!!) 


 ఆ సీరియల్ ముగింపు గురించి మా అత్తమ్మ ఎంత మందిని ఆరా తీసినా,..ఫలితం లేకపోయింది.మొత్తానికి కొన్ని రోజులు ప్రయత్నించి...వేరే సీరియల్స్ చూడటంలో మునిగిపోయిండ్రు..

రెండేళ్ళ తరువాత...

ఒకరోజు అత్తమ్మ మా ఇంటికి వచ్చిండ్రు..భాతాఖాని మాట్లాడుకుంటూ..మా బావ పెళ్లి విశేషాలు,ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటున్నాం..
అప్పుడే నేను "ముగింపు మిస్ అయిన సీరియల్" గురించి కావాలనే గుర్తుచేసాను మా వాళ్ళకి.... అంతే..మా అమ్మ,మా అత్తమ్మ..మళ్లీ ఆ ఎర్ర చీర గురించీ,ఆ సీరియల్ హీరో మూడో భార్య రెండో జన్మ గురించీ,అందులో విలన్ గురించీ,..ఇట్లా సదరు ఆ సీరియల్ డైరెక్ట్ చేసిన వాడికి కూడా గుర్తులేని విషయాలు మాట్లాడుకుంటూ,ఆ విషయాలు గుర్తుచేసుకుంటూ..ఆ సీరియల్ ముగింపు ఈ విధంగా ఉండి ఉండవచ్చు,.అని వాళ్లకు నచ్చని పాత్రలను చంపి,.నచ్చిన వారిని ఉంచి...మన హీరో రాజశేఖర్,జీవితలు ప్రెస్ మీట్ పెట్టి పనిగట్టుకొని చిరంజీవిని తిట్టినట్టు...ఆ సీరియల్ వాళ్ళని కొంచం సేపు తిట్టుకొని సంతృప్తి పడ్డారు..

"ఎంత తిట్టినా..దాని
క్లైమాక్స్ మీకు ఎట్లైన తెలవదు కదా" అని నేను అనగానే...

"ఔన్రా...అసలది ఏమైందో...ఎట్లా ముగించిండో...అందుకే ఈ సీరియల్స్ పాడుగాను..చుడనేవద్దు...ఒకరోజు చూడకపోయినా ఏం మనసునపట్టది..దరిద్రపు సీరియల్లు..."అని తిట్టుకుంటూనే....జెమినిలో కొత్త సీరియల్ "మహాలక్ష్మి నివాసం" వచ్చే టైం అయింది...టీవీ పెట్టు" అన్నారు మా మేనత్త..!!